బాలీవుడ్ ఎంట్రీ ముహూర్తం ఖరారు


 

టాలీవుడ్ లో ఛలో తో ఎంట్రీ ఇచ్చి గీత గోవిందంతో స్టార్ హీరోయిన్ గా మారిన కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్నా ప్రస్తుతం తెలుగు.. తమిళం.. కన్నడం మరియు హిందీ భాషల్లో వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్దం అవుతోంది. హిందీలో ఈ అమ్మడు ఇప్పటికే రెండు సినిమాల్లో నటించింది. ఒకటి అమితాబచ్చన్ తో నటించిన గుడ్ బై కాగా మరోటి సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి నటించిన మిషన్ మజ్ను. ఈ రెండు సినిమాలు కూడా రష్మిక మందన్నాను హిందీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చూపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ రెండు సినిమాల్లో మొదటగా మిషన్ మజ్ను సినిమాను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.

మిషన్ మజ్ను సినిమా పాకిస్తాన్ లో ఉండే ఇండియా గూఢాచారుల గురించిన కథతో రూపొందినట్లుగా చెబుతున్నారు. ఆసక్తికరమైన కథ మరియు కథనంతో రూపొందిన ఈ సినిమా ను వచ్చే ఏడాది సమ్మర్ లో మే 23న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి అయినప్పటికి ఇంకా ఆరు నెలల టైమ్ కు గాను ఈ సినిమాను విడుదల చేయనున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుతున్నట్లుగా పేర్కొన్నారు. సినిమా చిత్రీకరణ సమయంలోనే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. ఈమద్య కాలంలో దేశ భక్తి నేపథ్యంలో వచ్చిన.. వస్తున్న సినిమాలకు మంచి క్రేజ్ దక్కుతుంది. అందుకే ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో కాస్త ఆలస్యంగా విడుదల తేదీని ప్లాన్ చేశారని తెలుస్తోంది.

పుష్ప సినిమా తో అంతకంటే ముందుగానే బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు శ్రీవల్లిగా రష్మిక మందన్నా వెళ్లబోతుంది. కాని డైరెక్ట్ హిందీ సినిమా మాత్రం వచ్చే సమ్మర్ లో విడుదల అవుతుందనే అధికారిక ప్రకటన వచ్చింది. అమితాబచ్చన్ తో నటిస్తున్న సినిమా అంతకు ముందు వస్తుందా లేదా ఆ తర్వాత వస్తుందా అనే విషయంలో స్పష్టత రావాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. కన్నడం లో ఇప్పటికే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకున్న రష్మిక మందన్నా తెలుగు లో తక్కువ సమయంలోనే టాప్ స్టార్ హీరోయిన్ గా నిలిచింది. ఇక తమిళంలో చేసిన సినిమాలు కొన్ని అయినా కూడా మంచి విజయాలను దక్కించుకుని అక్కడ కూడా స్టార్ అయ్యింది. కనుక ఖచ్చితంగా ఈ అమ్మడు బాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపును దక్కించుకుని అక్కడ కూడా స్టార్ గా పేరు దక్కించుకోవడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రష్మిక మందన్నా తెలుగు లో నానికి జోడీగా కూడా ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఇక శర్వానంద్ నటిస్తున్న ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. వచ్చే ఏడాదిలో రష్మిక నటించి అరడజను సినిమాల వరకు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.